వేంపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు
- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసు
- అంబటిని విచారించిన సీఐ నరసింహులు
- వేంపల్లి నుంచి పులివెందులకు అంబటి పయనం
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ రోజు కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆయన విచారణకు హాజరయ్యారు.
ఫిబ్రవరి 1వ తేదీన టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు గారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అంబటిని వేంపల్లి సీఐ నరసింహులు విచారించి, ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన నేరుగా పులివెందుల వైపు పయనమయ్యారు. పులివెందులో కూడా అంబటిపై కేసు నమోదయింది. ఆ కేసు విచారణకు అంబటి హాజరుకానున్నారు.
అంతకుముందు, ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను అంబటి సందర్శించి, వైఎస్సార్ కు నివాళి అర్పించారు. జగన్ మళ్లీ సీఎంగా చేసేంత వరకు తాము విశ్రమించబోమని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయన వేంపల్లికి బయల్దేరారు. ఒకవైపు తనపై నమోదైనవి అక్రమ కేసులని, వీటిని ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన చెబుతుండగా... చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం అంటోంది.